Just In
- 1 hr ago లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- 2 hrs ago ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
- 7 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 7 hrs ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
లోక కళ్యాణం కోసమే శ్రీవారి బ్రహ్మోత్సవాలు...!
తిరుమల బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలియుగ ప్రత్యక్ష దైవం కోనేటి రాయుడికి కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా పడింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 72 రోజుల పాటు భక్తులకు ప్రవేశం లేకుండా పోయింది. ప్రస్తుతం కరోనా నిబంధనలు పాటిస్తూనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. చాంద్రమానం ప్రకారం రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అధికమాసం వస్తుంది. అలా 2020లో కూడా అధికమాసం వచ్చింది.
ఈ నెల సెప్టెంబర్ 19 నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు జరగనున్నాయి. కానీ ఈసారి ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అనుమతి దక్కలేదు. కేవలం స్వామి దర్శనానికి మాత్రం పరిమితంగా అవకాశం లభిస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎలా ప్రారంభమయ్యాయి. ఎప్పటినుండి వీటిని నిర్వహిస్తున్నారు... ఎందుకోసం ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
'బతుకమ్మ'ఈ ఏడాది ఎందుకని ఆలస్యమైంది? ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా...
లోకకళ్యాణం కోసం...
పురాణాల ప్రకారం వేంకటేశ్వర స్వామి ఏడుకొండలపై వెలసిన తొలిరోజుల్లోనే బ్రహ్మదేవుడిని పిలిచి లోకకళ్యాణం కోసం తనకు ఉత్సవాలు జరిపించాలని ఆజ్ణాపించారట. స్వామివారి ఆదేశానుసారం శ్రీనివాసుని ఆనంద నిలయంలో ఆవిర్భవించిన కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు తొమ్మిదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.
‘బ్రహ్మోత్సవాలు’గా ప్రసిద్ధి..
అప్పటి నుండి ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆనాటి నుండి నేటి కలియుగం వరకు ఈ ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలకు ఎంతో విశిష్టత ఉంది. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని ఆనందనిలయంలోని మొదలుకుని స్వర్ణతలుపుల వరకు ఉప ఆలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణంలోని గోడలు, పైకప్పుతో పాటు పూజాసామాగ్రిని శుద్ధి చేస్తారు.
అంకురార్పణ..
వైఖాసన ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ, స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. శ్రీస్వామివారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతమండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ మట్టిలో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పరణం అయ్యింది.
2020లో అధిక మాసం ఎప్పుడొచ్చింది.. ఈ మాసంలో శుభకార్యాలు చేయొచ్చా? చేయకూడదా?
ధ్వజారోహణం..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలన్నీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకస్వాములు స్వర్ణంతో కూడిన ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.
పెద్దశేషవాహనంపై
తొలిరోజు స్వామి వారు స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో ఊరేగింపు సమయంలో భక్తులను అనుగ్రహిస్తారు. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపరమపదం సిద్ధిస్తాయి. రెండోరోజున శ్రీమలయప్ప స్వామివారు చిన్నశేషవాహనంపై స్వామివారు విహరిస్తారు. పురాణాల ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణ సంప్రదాయానుసారం భగవంతుడుశేషి, ప్రపంచ శేషభూతం. శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రసిద్ధి.
హంస వాహనం..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శ్రీమలయప్పస్వామి వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో కూడా దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక. మూడోరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సింహవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. యోగశాస్త్రంలో సింహం బలానికి(వహనశక్తి), వేగానికి(శీఘ్రగమన శక్తి) ఆదర్శంగా భావిస్తారు. అదేరోజు రాత్రి స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
కల్పవృక్ష వాహనంపై..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శ్రీమలయప్ప స్వామి వారు కల్పవృక్షవాహనంపై ఆలయంలోని నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అదేరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం.
మోహినీ అవతారంలో..
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ఐదోరోజున మోహినీ రూపంలో దర్శనమిస్తారు. అదేరోజు రాత్రి గరుడ వాహనంపై జగన్నాటక సూత్రధారియైన శ్రీమలయప్పస్వామి వారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తాడు.
హనుమంత వాహనంలో..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుని రాముని అవతారంలో హనుమతుని వాహనంపై విహరిస్తాడు. అదేరోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అదేరోజు రాత్రి ఏడుకొండల స్వామి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.
సూర్య ప్రభ వాహనంపై..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరువీధుల్లో విహరిస్తారు. అదేరోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. చంద్రుడు శివునిని శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండటం విశేషం.
అశ్వవాహనంపై..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు ఎనిమిదో రోజు ఉదయం అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంలో ప్రబోధిస్తున్నాడు.
చివరిరోజున..
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. అదేరోజు రాత్రి స్వర్ణ తిరుచ్చి ఉత్సవం తర్వాత ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఈ ఘట్టంతో తొమ్మిదిరోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.