Just In
Emotional pain: శరీరానికి అయిన గాయాల కంటే మనసుకయ్యే గాయాల బాధ ఎక్కువ
శరీరానికి ఏదైనా గాయం అయితే అది మానే వరకు నొప్పిగా ఉంటుంది. తర్వాత దాని నుండి ఎలాంటి నొప్పి లాంటి బాధ కలగదు. కానీ మనసుకు అయ్యే గాయాలు.. అవి తగ్గి యథాస్థితికి చేరినా కూడా మళ్లీ మళ్లీ తిరగబెడతాయి.
Emotional pain: వేమన శతకంలో చెప్పినట్లుగా ఇనుము విరిగినా కాల్చి అతుకుపెట్టవచ్చు. కానీ, మనుసు విరిగితే దానిని సరిచేయలేము. ఎందుకుంటే మనసు అనేది భావోద్వేగ భరితం. దానికి ఏ చిన్న నొప్పి కలిగినా తీవ్ర మైన బాధ కలుగుతుంది. అంత తేలికగా దాని నుండి బయటపడలేము. శరీరానికి ఏమైనా గాయాలు అయితే ఆ బాధ కొన్ని రోజుల వరకు ఉంటుంది. మందులు, సిరప్ లు తాగితే అది తగ్గుతుంది. అయింట్మెంట్ పెడితే గాయాల నుండి ఉపశమనం లభిస్తుంది.కానీ మనసుకు తగిలే గాయాలకు అయింట్మెంట్ అంటూ ఏదీ లేదు. ఆ నొప్పి దానికదే మెల్లిగా తగ్గాల్సిందే. దానికి కాలమే పరిష్కారం చూపుతుంది.
నొప్పి అనేది ఇంద్రియ భాగాలతో పాటు శారీరక, భావోద్వేగ అంశాలను కలిగి ఉంటుంది. అందుకే శారీరక, మానసిక నొప్పి... అనేది నాడీ సంబంధిత సంబంధాల గురించి న్యూరో సైన్స్ అధ్యయనాలలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. శారీరక, మానసిక గాయాలు, క్షోభ గురించి పలువురు పరిశోధకులు పలు అధ్యయనాలు చేశారు. శారీరక గాయాల కంటే మానసిక క్షోభ ఎక్కువ నొప్పిని కలిగిస్తుందని ఆయా అధ్యయనాలు తేల్చి చెప్పాయి. సైకలాజికల్ సైన్స్ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో శారీరక నొప్పి ఉన్న వారి కంటే మానసిక నొప్పి ఉన్న వారిలో క్షోభ ఎక్కువగా ఉంటుందని తేలింది.
శరీరానికి ఏదైనా గాయం అయితే అది మానే వరకు నొప్పిగా ఉంటుంది. తర్వాత దాని నుండి ఎలాంటి నొప్పి లాంటి బాధ కలగదు. కానీ మనసుకు అయ్యే గాయాలు.. అవి తగ్గి యథాస్థితికి చేరినా కూడా మళ్లీ మళ్లీ తిరగబెడతాయి. అవి గుర్తుకు వచ్చి వ్యధ చెందుతారు.
బాధాకరమైన జ్ఞాపకాలను తిరగదోస్తుంది
ఒక అధ్యయనం ప్రకారం, జ్ఞాపక శక్తి, శ్రద్ధ వంటి స్థితులు నొప్పిని తగ్గిస్తాయి లేదా పెంచవచ్చు. శారీరక నొప్పిలా కాకుండా, భావోద్వేగ భరిత నొప్పి అనేది తరచూ గుర్తుకు వస్తుంది. ఏదైన సందర్భం ఎదురైనప్పుడు అది మళ్లీ మళ్లీ బాధను కలిగిస్తుంది. గతంలో నొప్పి కలిగించిన మానసిక స్థితికి సంబంధించిన ఏదైనా విషయం మళ్లీ ఎదురైతే.. ఆ జ్ఞాపకాలు మదిని మెలిపెడతాయి. దీని వల్ల కుంగుబాటు వస్తుంది.
ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది
మానసిక ఒత్తిడి, మానసిక బాధ మధ్య సంక్లిష్టమైన సంబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. కొన్ని అధ్యయనాలు బాధాకరమైన లేదా ప్రతికూల భావోద్వేగ అనుభవాలు.. శారీరక నొప్పిని ప్రేరేపిస్తాయి. గతం నుండి జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గురించి తిరిగి ఆలోచించడం వల్ల... శరీరం కూడా ప్రభావితం అవుతుంది. తీవ్రమైన మానసిక సంఘర్షణ ఒత్తిడిని పెంచుతుంది. దీని వల్ల మెదడులోని కెమిస్ట్రీ ప్రభావితం అవుతుంది. తీవ్రమైన తలనొప్పి బాధిస్తుంది. ఒక్కో సారి అధిక రక్త పోటు సంభవిస్తుంది. కొందరిలో మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని ప్రభావం శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పైనా వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. అలసట ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి మరిన్ని రోగాలకు దారి తీసే అవకాశం ఉంటుంది.
మానసిక సమస్య ఆరోగ్యాన్నీ పాడు చేస్తుంది
ఒక వ్యక్తి యొక్క మానసిక ప్రశాంతతను తీవ్రంగా దెబ్బ తీసేందుకు కొన్ నిసార్లు భావోద్వేగపూరిత నొప్పి కారణం అవుతుంది. శారీరక నొప్పి మన మానసిక శ్రేయస్సుపై ప్రభావం చూపాలంటే, అది చాలా తీవ్రంగా అలాగే బాధాకరంగా ఉండాలి. దీర్ఘకాలికంగా వేధించే భావోద్వేగ భరితమైన నొప్పి వ్యక్తులలో నిస్పృహకు కారణం అవుతుంది. ఇది వారిని చెడు ప్రవర్తన, మద్య పానం లేదా మాదక ద్రవ్యాలకు బానిసగా మారేలా ప్రేరేపిస్తుంది. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
ఎంపతీ గ్యాప్స్
ఎంపతీ అంటే సానుభూతి. సానుభూతి అంతరం అనేది మన మానసిక స్థితుల గురించి తక్కువ అంచనా వేస్తుంది. ఈ ధోరణి వల్ల మనం మానసికంగా కుంగుబాటుకు గురి అవుతున్నాం అనేది చాలా ఆలస్యంగా గుర్తించే ప్రమాదం ఉంటుంది. ఇలా గుర్తించే నాటికి దాని నుండి కలిగే బాధ ఎన్నో రెట్లు ఎక్కువ అవుతుంది. మానసికంగా బాధ పడుతున్నాం అనేది ఎంత త్వరగా తెలుసుకుంటే.. దాని నుండి అంత త్వరగా బయట పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు.
ముగింపు
మనం మన మానసిక ఆరోగ్యాన్ని మన శారీరక ఆరోగ్యంతో సమానమైన శ్రద్ధతో వ్యవహరించాలి. తిరస్కరణ, వైఫల్యం, ఒంటరితనం లేదా అపరాధం వంటి భావోద్వేగ గాయాలను అనుభవించినప్పుడు... వాటి నుండి ఎలా బయట పడాలా అనేది ఆలోచించాలి. దానిని ఎలా పరిష్కరించాలో దారులు వెతకాలి. మనకు మనం నయం చేసుకోలేనంత బాధ ఉంటే.. మానసిక నిపుణులను సంప్రదించడం అత్యుత్తమమైన మార్గంగా పరిగణించాలి. మన సమాజంలో మానసిక నిపుణుడి వద్దకు వెళ్లాలంటే కొంత భయం వెంటాడుతుంది. ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారోనని మదన పడిపోతూ ఉంటారు. పిచ్చి పట్టిందని అనుకుంటారేమోనని భయపడతారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసిక వైద్యులకు చాలా డిమాండ్ ఉంటోంది. జీవించే తీరు మారడం వల్ల చాలా మందిలో మానసిక రుగ్మతలు బయటపడుతున్నాయి. కొందరు మాత్రమే ధైర్యంగా బయటకు వచ్చి తమ సమస్యలు చెబుతున్నారు.