విరుచుకుపడుతున్న తుఫాన్- ఏపీలో బీభత్సం..!!

By Chandrasekhar Rao

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను తీరానికి సమీపించింది. తమిళనాడు ఉత్తరం ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో ఈ మూడు చోట్లా అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. డిజాస్టర్ రెస్పాన్స్ సిబ్బందిని తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో మోహరించింది.

శ్రీలంక తీరం, దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన దిత్వ తుఫాను.. నెమ్మదిగా ఉత్తరం వైపు కదులుతోంది. తమిళనాడులోని కారైకల్ కు దక్షిణ-ఆగ్నేయ దిశలో 100, పుదుచ్చేరికి దక్షిణ-ఆగ్నేయ దిశలో 190, చెన్నైకి దక్షిణ-ఆగ్నేయ దిశలో 290 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది.


Cyclone Ditwah Approaches Tamil Nadu and Andhra Pradesh

ఈ తుఫాను శ్రీలంక తీరం, బంగాళాఖాతం నైరుతి- వాయువ్య దిశలో కదులుతోంది. తమిళనాడు ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ ప్రాంత తీరాలకు మరింత చేరువ కానుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేకించి- రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దీని ప్రభావంతో నేడు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కరుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

నేడు- ఈ మూడు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. అలాగే ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తిరుపతి, అన్నమయ్య రాయచోటి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ అయింది.

అదేవిధంగా శ్రీ సత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాన్.. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబండి గంటకు 70 నుంచి 80 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి.

Credit: Oneindia

Desktop Bottom Promotion