ఖమేనీ మృతి: 40 రోజుల పాటు సంతాప దినాలు: కోడలు, అల్లుడు, మనవళ్లు సైతం

By Chandrasekhar Rao

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు వెల్లడించారు. అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక చర్యలో ఆయన హతమైనట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఖమేనీని అత్యంత దుర్మార్గుడైన నాయకుడిగా అభివర్ణించారు ట్రంప్. ఈ విషయాన్ని అటు ఇరాన్ కూడా అధికారికంగా ప్రకటించింది. 40 రోజుల సంతాప దినాలను పాటించాలని పిలుపునిచ్చింది.

"చరిత్రలో అత్యంత దుర్మార్గుడైన ఖమేనీ మరణించాడు. ఇది ఇరాన్ ప్రజలకే కాదు, ఖమేనీ వల్ల కోలుకోలేని విధంగా దెబ్బతిన్న ప్రపంచదేశాలు, ప్రజలకు న్యాయం జరిగింది.." అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ కూడా దీన్ని నిర్ధారించింది. ఇదే సమాచారాన్ని ట్వీట్ చేసింది. తమ దేశాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇరాన్ ప్రజలకు గొప్ప అవకాశం లభించిందని ట్రంప్ చెప్పారు. ఖమేనీ మరణించిన తర్వాత కూడా ఈ సైనిక చర్యలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.


Donald Trump Claims Khamenei Is Dead After US-Israeli Strikes on Iran and Signals Continued Strikes

ఖమేనీ తమ ట్రాకింగ్ వ్యవస్థల నుండి తప్పించుకోలేకపోయారని, ఎట్టకేలకు దొరికిపోయారని తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి పని చేయడం ద్వారా ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. ఖమేనీతో పాటు పలువురు సీనియర్ నాయకులు హతమయ్యారని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

రెవల్యూషనరీ గార్డ్, భద్రతా దళాలు ఇప్పుడు చావు కోసం ఎదురు చూస్తోన్నాయని హెచ్చరించారు. వారికి మరణం తప్పదనీ వ్యాఖ్యానించారు. మిడిల్ ఈస్ట్ తో పాటు ప్రపంచశాంతి కోసం అవసరమైనంత కాలం ఈ తీవ్రమైన, ఖచ్చితమైన బాంబు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు.

ఖమేనీ నివాసం సమీపంలో జరిగిన దాడులు జరిగినప్పుడే ఆయన మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఛానల్ 'ప్రెస్ టీవీ' ధృవీకరించింది. ఖమేనీతో పాటు ఆయన అల్లుడు, కోడలు, మనవళ్లు మరణించారని శనివారం తెహ్రాన్ నగర కౌన్సిల్ సభ్యుడు తెలిపారు.

86 ఏళ్ల ఖమేనీ 1989 నుంచి అధికారంలో కొనసాగుతూ వచ్చారు. మిడిల్ ఈస్ట్ లో అత్యధిక కాలం పాలించిన దేశాధినేతగా నిలిచారు. ఆయన మృతి 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో నాయకత్వ మార్పు తప్పనిసరి అయింది. ఖమేనీ మరణంతో ఆయన వారసుడెవరనే ప్రశ్న తలెత్తింది.

ఇరాన్ రాజ్యాంగం ప్రకారం 88 మంది సభ్యుల 'అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్' కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంటుంది. ఈ పదవికి పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. వారసుల జాబితాలో అయతుల్లా అలీరెజా అరఫీ (ఇరాన్ మదర్సా వ్యవస్థ అధిపతి, గార్డియన్ కౌన్సిల్ సభ్యుడు). ఖమేనీ అత్యంత సన్నిహితుడు, కార్యాలయ సీనియర్ సలహాదారు హుజ్జత్-ఉల్-ఇస్లాం మొహసిన్ ఖోమి కూడా ప్రముఖంగా ఉన్నారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మాజీ సభ్యుడు అయతుల్లా మొహసిన్ అరకీ కూడా రేసులో ఉన్నారు.

Credit: Oneindia

Desktop Bottom Promotion