పుల్లటి మామిడికాయతో నెల్లూరు చేపల పులుసు.. నెల్లూరుకే వెళ్లనవసరం లేదు..!

Posted By:

నెల్లూరు చేపల పులుసు తినాలంటే నెల్లూరుకే వెళ్లనవసరం లేదు. ఇంట్లోనే చేపలను తెచ్చుకొని నెల్లూరు చేపల పులుసును చేసుకోవచ్చు. నెల్లూరు చేపల పులుసు కేవలం నెల్లూరు చేపల వల్ల వచ్చింది కాదు, వారు ఆ కూరను తయారు చేసే విధానం వల్ల నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమస్ అయింది. నెల్లూరు చేపల పులుసును ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

నెల్లూరు చేపల పులుసు తయారు చేయడానికి కావలసిన వంటసామాగ్రి

కేజీ చేపలు, కారంపొడి, ఉప్పు, దనియాల పొడి, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ, టమాట, మెంతులు, జిలకర, ధనియాలు, ఆవాలు, మంచినూనె, మెంతులు, ఆవాలు, జిలకర, కరివేపాకులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మామిడికాయ ముక్కలు, టమాట ముక్కలు, పసుపు, దనియాల పొడి, కొత్తిమీర ఆకులు.

నెల్లూరు చేపల పులుసు తయారు చేసే విధానం

1. ముందుగా కేజీ చేపల ముక్కలను నీళ్లల్లో బాగా కడగాలి. ఆ చేపముక్కలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ చేపల ముుక్కలపై 2 టీస్పూన్ల కారంపొడి, తగినంత ఉప్పు, తగినంత ధనియాల పొడిని వేసుకొని చేపలు ముక్కలను మారినేట్ చేసుకోవాలి. చేపల ముక్కలకు మొత్తానికి మసాలా బాగా అంటేలా జాగ్రత్తపడాలి.

2. 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టాలి. మూడు ఉల్లిపాయలను సన్నగా తరిగి తీసుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలను, ఒక పుల్లటి మామిడికాయను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక ప్యాన్‌ను పెట్టుకొని అందులో అర టీస్పూన్ మెంతులను, అర టీస్పూన్ జిలకర, 2 టీస్పూన్ల ధనియాలను, అర టీస్పూన్ ఆవాలను వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని మిక్సీ జార్‌లో వేసి పొడిగా చేసుకోవాలి.

4. మళ్లీ ఖాలీ ప్యాన్‌ను స్టవ్‌పై పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల మంచి నూనెను పోసుకోవాలి. పావు టీస్పూన్ మెంతులను, పావు టీస్పూన్ ఆవాలును, అర టీస్పూన్ జిలకర, కొన్ని కరివేపాకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

5. ప్యాన్‌లో కట్ చేసిన మామిడికాయ ముక్కలను, టమాట ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. పావు టీస్పూన్ పసుపు, 3 టీస్పూన్ల కారంపొడి, రుచికి సరిపడ ఉప్పును, ఇంతకు ముందు గ్రైండ్ చేసిన దనియాల పొడిని కూడా వేసుకోవాలి.

6. నానబెట్టిన చింతపండు నుంచి తీసిన రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చేపల పులుసులో గ్రేవీ ఎంత కావాలో అన్ని నీళ్లను యాడ్ చేసుకోవాలి. 5 నిమిశాల వరకు ఈ గ్రేవీని బాగా మరిగించాలి. తరువాత మరుగుతున్న గ్రేవీలోనే చేపల ముక్కలను యాడ్ చేసుకోవాలి. 10 నిమిశాల వరకు గ్రేవీలో చేప ముక్కలను ఉడికించాలి. స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి.

7. చేపలు ఉడుకుతున్నప్పుడు గరిటెతో కలపవద్దు, అలా కలిపితే చేపల ముక్కలు విరిగిపాతాయ్. కూరలో కొద్దిగా కొత్తిమీర ఆకులను చల్లుకోవాలి. ఇక దీంతో నెల్లూరు చేపల పులుసు రెడీ అయినట్టే. చేపల పులుసు వేడిగాకన్నా చల్లారిన తరువాత తింటేనే రుచిగా వుంటుంది. కూరను స్టవ్‌పై నుంచి కిందకు దించుకొని మొత్తం చల్లారిన తరువాత సర్వ్ చేసుకొని తినండి.

[ of 5 - Users]
Story first published: Thursday, June 13, 2024, 13:30 [IST]
Desktop Bottom Promotion