Just In
- 12 hrs ago గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- 12 hrs ago అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- 15 hrs ago Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- 17 hrs ago Gruha Pravesham Wishes : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
కరోనా ఎఫెక్ట్ : ముచ్చటగా మూడోసారి మూడుముళ్ల తంతును వాయిదా వేసేశారు...
కేరళలోని కోజికోడ్ జిల్లాలో వారి వివాహ కార్యక్రమాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 2018 సంవత్సరం మే నెల 20వ తేదీన ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు.
కేరళ రాష్ట్రంలోని ప్రేమ్ చంద్రన్(26), సాంద్రా సంతోష్(23) ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వారిద్దరూ వివాహం అనే బంధం ద్వారా ఏడడుగులు వేసి కలకాలం హాయిగా జీవించాలనుకున్నారు. ఇందుకోసం వారి పెద్దలను కూడా ఒప్పించారు. ఇరు కుటుంబాల వారు వీరి పెళ్లి కోసం మంచి ముహూర్తాన్ని సైతం నిర్ణయించారు.
మరికొన్ని రోజుల్లో మూడుముళ్ల తంతుతో తమ ఒంటరి జీవితానికి ముగింపు పలకాలని ఎంతో ఆశగా ఎదురుచూసిన వారికి 2018 నుండి 2020 వరకు నిరాశే ఎదురవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ముచ్చటగా మూడోసారి కూడా వారు నిర్ణయించిన ముహుర్తానికి పెళ్లి జరగలేదు. అయితే వీరి పెళ్లికి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా? ఈ ప్రేమ జంట వివాహానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మొదటిసారి...
మరి కొద్దిరోజుల్లో తామిద్దరం కలిసి ఒక్కటయ్యే మధురక్షణాల కోసం ఎన్నోకలలు గన్నారు. అందుకు తగ్గట్టే ఎంగేజ్ మెంట్ ను గ్రాండ్ గా చేసుకున్నారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలో వారి వివాహ కార్యక్రమాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 2018 సంవత్సరం మే నెల 20వ తేదీన ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే అప్పుడే కేరళలో తొలి నిఫా కేసు నమోదైంది. కోజికోడ్ జిల్లాలో కొన్ని గంటల వ్యవధిలోనే వందలాది నిఫా కేసులు నమోదయ్యాయి.
బయటకు రావాలంటేనే..
కోజికోడ్, మలప్పురం జిల్లాలో సుమారు 17 మంది మరణించారు. దీంతో అక్కడ నివసించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలం వెళ్లదీశారు. ఆ సమయంలో బయటకు రావాలంటేనే తెగ భయపడిపోయేవారు. ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం ఈ నిఫా వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జన సమూహాలపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆదేశించింది. దీంతో ప్రేమ్, సాంద్రా పెళ్లి వేడుకను తొలిసారి వాయిదా వేసేశారు.
మళ్లీ ఝలక్..
అయితే నిఫా వైరస్ కేరళలో తగ్గేందుకు సుమారు ఆరు నెలల సమయం పట్టింది. నిఫా నుండి బయటపడిన తర్వాత పెళ్లి చేసుకుందామని భావించిన ఆ ప్రేమ జంటకు ఈసారి వారి కుటుంబం నుండే ఓ పెద్ద ఝలక్ తగిలింది. అకస్మాత్తుగా ప్రేమ్ పెదనాన్న మరణించారు. దీంతో ఏడాది కాలం పాటు వారింట్లో ఎలాంటి శుభకార్యాలు జరగకూడదని వాయిదా వేశారు. ఇది అక్కడి ఆచారమట. దీంతో 2019 ఆగస్టుకు వాయిదా పడింది.
రెండోసారి..
మొదటిసారి వాయిదా పడిన తమ పెళ్లిని రెండోసారి ఓనం సెలవుల్లో ఘనంగా జరుపుకోవాలని బాగా ప్లాన్ చేసుకున్నారంట. ఏడాది ఎడబాటుతో ఆ ప్రేమ జంట పెళ్లి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. అయితే అప్పుడు చిన్నగా చినుకులు కురిశాయి. ఆ చినుకులు వారిని ఆశీర్వదించాయి కానీ.. వారి వివాహానికి అవే అడ్డుకట్టగా మారిపోయాయి.
వరదలు..
కేరళ రాష్ట్రంలో అప్పుడు వారం రోజుల పాటు ఒకటే జడివాన కురిసింది. వంద సంవత్సరాల్లో ఎన్నడూ చూడని వరదను అప్పుడు చూడాల్సి వచ్చింది. కేరళలోని 80 శాతానికి పైగా ప్రాంతాల్లో జలవిలయం ఏర్పడింది. అప్పుడు మళ్లీ కేరళ మొత్తం అతలాకుతలమైంది. అప్పుడు రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ వరద నీటిలో చిక్కుకున్న వారిని అత్యంత చాకచక్యంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అలా వరదల నుండి కోలుకోవడానికి కేరళకు మరో ఆరు నెలల సమయం పట్టింది. దీంతో వీరి పెళ్లి రెండోసారి కూడా వాయిదా పడింది.
ముచ్చటగా మూడోసారి..
రెండుసార్లు వాయిదా పడ్డ తమ పెళ్లికి ప్రస్తుతం ఏ ఆటంకాలు లేవనుకున్నారు. ఇరు కుటుంబాల వారు 2020 మార్చి 22న ముహుర్తం సైతం నిర్ణయించారు. అందుకోసం చాలా వేగంగా ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. సుమారు 2 వేల మందికి వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచేశారు. ఫంక్షన్ హాల్, మంగళవాయిద్యాలు, ఫొటోగ్రాఫర్, వంట వారితో పాటు అందరికీ అడ్వాన్సు కూడా ఇచ్చేశారు. బంధువులకు కొత్త బట్టలు కొనుక్కొచ్చారు. కానీ ముచ్చటగా మూడోసారి కూడా వారి వివాహం వాయిదా పడింది.
కరోనా కారణంగా..
సరిగ్గా వారి పెళ్లికి కొద్దిరోజులు ముందుగానే కరోనా వైరస్ చైనా నుండి భారత్ లోకి ప్రవేశించింది. అప్పటికే చైనాను అతలాకుతలం చేసిన ఈ కరోనా మహమ్మారి మన దేశంలో తొలిసారిగా కేరళలోనే అడుగుపెట్టింది. అలా వచ్చిన కరోనా కేరళలో భయంకరంగా తయారైంది. కొన్ని గంటల వ్యవధిలోనే వందల కేసులలో కరోనా పాజిటివ్ గా తేలింది.
మళ్లీ బ్రేక్..
మన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా పెరిగిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే అక్కడ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో వారి పెళ్లికి మళ్లీ బ్రేక్ పడిందని వారికి అర్థమైంది. దీంతో వారి పెళ్లి వేడుకను మరోసారి వాయిదా వేయక తప్పలేదు.
ఆవిరైన ఆశలు..
రెండుసార్లు వాయిదా పడ్డ తమ వివాహం ముచ్చటగా మూడోసారైనా ఘనంగా జరుపుకుందామన్న ఆ జంట ఆశలు కరోనా వైరస్ ఆవిరి చేసేసింది. అయితే ప్రభుత్వ అనుమతి తీసుకుని అతి కొద్ది మందితో వారి వివాహాన్ని సింపుల్ చేసేయొచ్చు. కానీ సాంద్రా కుటుంబంలో ఇదే మొట్టమొదటి వేడుక కావడంతో వారు సింపుల్ గా చేయాలనుకోవటం లేదు.
ఎంత కాలమైనా...
తమ కుటుంబంలో జరిగే మొట్టమొదటి శుభకార్యం కనుక, తాము బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ఈ వివాహ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎంతకాలమైనా ఎదురుచూస్తామని సాంద్రా కుటుంబం చెబుతోంది. అందుకు ప్రేమ్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు. ‘ప్రేమ్ నాకు చాలా కాలంగా తెలుసు. అతడితో నేను చాలా సన్నిహితంగా ఉన్నా.. మా పెళ్లి కోసం తాము ఎంత కాలమైనా సంతోషంగా ఎదురుచూస్తాం. పెళ్లికి ముందు మేం ఇంకా ఎన్నో క్షణాలను మధురంగా మలచుకోవడానికి ఇదొక చక్కని అవకాశంగా భావిస్తున్నాం‘ అని 23 ఏళ్ల సాంద్రా వెల్లడించింది. దీంతో ఇదే ఏడాది సెప్టెంబర్ లో ప్రేమ్, సాంద్రా పెళ్లికి ఇరువురి తల్లిదండ్రులు నాలుగోసారి వివాహ ముహుర్తం నిర్ణయించారు. అయితే మళ్లీ వర్షాలు, వరదలు రాకుండా ఈసారైనా వారి వివాహం ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలని మనమంతా కోరుకుందాం...