Just In
- 1 hr ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- 4 hrs ago నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- 6 hrs ago ఈ అలవాట్లు ఉన్నవారికి తీవ్ర కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది...వెంటనే బయటపడండి...!
- 7 hrs ago Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
అక్షయ తృతీయకు సంబంధించిన 9 విశేష గాధలు
అక్షా తీజ్ లేదా అక్షయ తృతీయ అనే పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ పండుగను ఏప్రిల్ 22వ తారీఖున జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పండుగనాడు కొందరు ఉపవాసం ఉంటారు, మరికొందరు దానధర్మాలు చేస్తారు. మరికొందరు వారి పితృదేవతలను స్మరించుకుంటారు.
కానీ, అసలీ పండుగ ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా? మిగతా పండుగల కంటే ఈ పండుగ ఎందుకంత ముఖ్యమో మీకు తెలుసా? అక్షయ తృతీయకు సంబంధించి ఎన్నో విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. అటువంటి కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
త్రేతాయుగ ప్రారంభంలో
త్రేతా యుగం అక్షయ తృతీయ నాడే ప్రారంభం అయిందని హిందూమత గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. మానవజాతికి సంబంధించి నాలుగు యుగాల గురించి హిందూ మతంలో ప్రస్తావన ఉంది. సత్యయుగం, త్రేతా యుగం, ద్వాపరయుగం మరియు కలియుగంగా వాటి గురించి వివరణనిచ్చారు. ప్రస్తుతం, మనం కలియుగంలో నివసిస్తున్నాము. త్రేతాయుగంలో శ్రీమహావిష్ణువు మూడు అవతారాలను ధరించాడు. త్రేతా అనగా మూడు అని అర్థం. వామనుడిగా అయిదవ అవతారం, పరశురాముడిగా ఆరవ అవతారం అలాగే శ్రీరాముడిగా ఏడవ అవతారాన్ని ధరించాడు శ్రీమహావిష్ణువు.
నర్ నారాయణ అనే విష్ణు మూర్తి అవతారాలు కూడా ఈ రోజునే చోటుచేసుకున్నాయి.
నర్ నారాయణ అనేవారు కవలలు. ఈ సోదరులను శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. 'నరుడు' అనగా మానవుడు. 'నారాయణుడు' అనగా దేవుడు. 'నర నారాయణుడు' సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలేనని పురాణ గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
శ్రీమహావిష్ణువు పరశురాముడిగా అక్షయతృతీయనాడే అవతరించాడని అంటారు.
పరశురాముడిగా శ్రీమహావిష్ణువు తన ఆరవ అవతారాన్ని ధరించాడు.పృథ్వీ మాత అనగా భూదేవి ఆజ్ఞ ప్రకారం పరశురాముడి అవతారాన్ని ధరించాడు శ్రీమహావిష్ణువు. రాజ్యపాలకులు క్రూరులుగా మారినప్పుడు భూమాత ఈ విధంగా శ్రీమహావిష్ణువును ఆజ్ఞాపించింది. పెరిగిపోతున్న పాపపు భారాలను తగ్గించడానికి పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు అవతరించి క్రూరపు పాలనను అంతమొందించాడు.
ఈ రోజునే విఘ్నేశ్వరుడికి వేదవ్యాసుడు మహాభారతాన్ని వివరించడం జరిగింది.
వేదవ్యాసుడనే ప్రముఖ మహర్షి మహాభారతాన్ని రచించాడు. వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు మహాభారతానికి అక్షరరూపం కల్పించాడు. ఆ విధంగా అక్షయ తృతీయ నాడే మహాభారతాన్ని వేదవ్యాసుడు వినాయకుడికి వివరించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.
భువిపైకి గంగ చేరిన రోజు
సగరుని వంశానికి చెందినవాడు భగీరథుడు. సగరునికి 60,000 మంది కుమారులు గలరు. ఈ వంశానికి చెందిన పూర్వీకులకు మరణం తరువాత ఆత్మశాంతి కలగకపోవటంతో భగీరథుడు వారి ఆత్మకు శాంతిని కలిగించేందుకు పవిత్రమైన గంగను భువిపైకి తీసుకువస్తానని తద్వారా వారి పాపాలను ప్రక్షాళన చేసుకోవచ్చని ప్రతిజ్ఞ చేస్తాడు. గంగను భువిపైకి తేవడంలో భగీరథుడు విజయం సాధించాడు. అక్షయతృతీయ నాడే గంగామాత భువిపైకి వచ్చిందని పురాణాల కథనం. అందువలనే, అక్షయ తృతీయకు అంతటి ప్రాముఖ్యం లభించిందని తెలుస్తోంది.
కుబేరుడు తన నిధులను సమకూర్చుకున్నాడు
రాజులకు దేవుడైన కుబేరుడు అక్షయ తృతీయ నాడే నిధులను సమకూర్చుకున్నాడట.
మహాభారతంలో యుధిష్టరుడు ఈ రోజునే అక్షయపాత్రను దక్కించుకున్నాడని పురాణాలు తెలుపుతున్నాయి.
పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారి నివాసానికి అతిథుల రాక ఎక్కువగా ఉండేది. వారు అరణ్యవాసంలో ఉండటం వలన అతిథులకు తగిన మర్యాదలు చేయడానికి వారి వద్ద ఏమీ ఉండేవి కావు. ఈ విషయంలో ద్రౌపది ఎంతో దిగులు చెందుతూ ఉండేది. ఈ సమస్య గురించి ద్రౌపది కృష్ణుడితో చర్చించినప్పుడు శ్రీ కృష్ణుడు యుధిష్టరుడిని సూర్యదేవుడిని ప్రార్ధించమని సలహా అందిస్తాడు. సూర్యభగవానుడి నామస్మరణను 108 సార్లు చేయమని సూచిస్తాడు. కృష్ణుడి సలహాను పాటించిన యుధిష్టరుడికి ఆ విధంగా అక్షయపాత్ర లభిస్తుంది. 'అక్షయం' అంటే అంతులేనిది. ఈ సంఘటన అక్షయ తృతీయ ప్రాముఖ్యాన్ని గుర్తుచేస్తుంది.
సుధాముడు శ్రీకృష్ణుడిని సందర్శించిన రోజు
శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు సుధాముడు పేదవాడు. ఒక రోజు శ్రీకృష్ణుడిని కలవాలని అతను నిర్ణయించుకున్నాడు. శ్రీ కృష్ణుడికి ఇవ్వడానికి అతని వద్ద ఏమీ లేదు. కాసిన్ని అటుకులు మాత్రమే ఉన్నాయి. సుధాముడిచ్చిన అటుకులను శ్రీకృష్ణుడు ఎంతో ప్రేమతో స్వీకరించాడు. సుధాముడు ఇంటివద్దకు రాగానే వారి పూరిగుడిసె కాస్త బ్రహ్మాండమైన బంగాళాగా మారిపోయింది. సుధాముడు ధనవంతుడిగా మారిపోయాడు. ఇప్పుడు, తన ఆర్థిక హోదా పెరిగింది. అందువలన, తన ధర్మాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాటించగలిగాడు.
పరశురామ జయంతి
శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించేందుకు కౌరవుల సభకు విచ్చేసిన రోజు ఇదే.
జూదంలో పాండవులు ఓడిపోయినప్పుడు కౌరవ సభలో 'ద్రౌపది వస్త్రాపహరణం' జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు విచ్చేసి ద్రౌపది మానాన్ని రక్షిస్తాడు. ఆ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుడిని ఈ రోజు భక్తిశ్రద్దలతో పూజిస్తారు.
ఆది శంకరాచార్యుడు కనకధారా స్తోత్రాన్ని పఠించిన రోజు
21 శ్లోకాలు కలిగిన కనకధారా స్తోత్రమనేది శ్రీమహాలక్ష్మిని స్తుతించే స్తోత్రం. ఆదిశంకరాచార్యుడు తనకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు సన్యాసం స్వీకరించాడు. ఒకసారి, ఓ పేద బ్రాహ్మణ మహిళ ఇంటివద్దకు భిక్షకు వెళ్తాడు. తనవద్ద ఏమీ లేకపోవటంతో ఒక ఉసిరికాయను ఆమె భిక్షగా వేస్తుంది. పెదమహిళ దయకి ఆమె చూపించిన కరుణకు ముచ్చటపడిన ఆదిశంకరాచార్యుడు లక్ష్మీమాతను ప్రసన్నం చేసుకోవడానికి కనకధారా స్తోత్రాన్ని పఠిస్తాడు. ప్రసన్నమైన లక్ష్మీమాత ప్రత్యక్షమవగా ఈ పేద బ్రాహ్మణురాలిని కరుణించమని కోరతాడు. లక్ష్మీమాత ఆ పేదమహిళ ఇంటిని సకలసంపదలతో నింపుతుంది. ఆ రోజునే అక్షయతృతీయగా జరుపుకుంటారు.