మటన్ బిర్యానీని మరిపించే..చెట్టినాడ్ అరటి పువ్వు బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మధ్యాహ్న భోజనానికి రోజూ చేసే వంటకాలతో విసుగొచ్చి, కుటుంబ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచేలా ఏదైనా కొత్తగా, రుచికరంగా వండాలనిపిస్తోందా? మీ ఇంట్లో అరటి పువ్వు ఉంటే, ఇక ఆలోచించాల్సిన పనే లేదు. సాధారణంగా అరటి పువ్వుతో వేపుడు చేసుకోవడం మనకు అలవాటు. కానీ ఒక్కసారి దాంతో నోరూరించే చెట్టినాడు స్టైల్ బిర్యానీ ప్రయత్నించి చూడండి. ఈ బిర్యానీ సువాసన ఇల్లంతా వ్యాపించి, అందరి ఆకలిని రెట్టింపు చేస్తుంది.

దీని రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇది శాఖాహార బిర్యానీ అని ఎవరూ గుర్తుపట్టలేరు. అచ్చం మటన్ బిర్యానీ తింటున్న అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కసారి మీరు దీనిని వండి వడ్డిస్తే మీ కుటుంబ సభ్యులు మళ్లీ మళ్లీ కావాలని అడగడం ఖాయం. అరటి పువ్వ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

అరటిపువ్వు బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-చిన్న ఉల్లిపాయలు - 6
-పచ్చిమిర్చి - 2
-అల్లం - 2 అంగుళాల ముక్క
-వెల్లుల్లి రెబ్బలు - 5
-సోంపు - 1 టీస్పూన్
-గసగసాలు - 1 టీస్పూన్
-లవంగాలు - 2
-యాలకులు - 1
-టమోటా - 1
-నూనె - 3 టేబుల్ స్పూన్లు
-నెయ్యి - 1 టేబుల్ స్పూన్
-బిర్యానీ ఆకు - 1
-దాల్చిన చెక్క - 1 అంగుళం
-లవంగాలు - 3
-యాలకులు - 2
-రాతిపువ్వు- చిన్న ముక్క
-అనాస పువ్వు - 1
-పెద్ద ఉల్లిపాయలు - 2
-పుదీనా ఆకులు - ఒక గుప్పెడు
-అరటి పువ్వు - ఒక గుప్పెడు
-కారం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
-గరం మసాలా - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
-ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
-గట్టి పెరుగు - పావు కప్పు
-నీరు - ఒకటిన్నర కప్పులు
-జీలకర్ర సాంబ బియ్యం - 1 కప్పు
-ఉప్పు - రుచికి సరిపడా
-కొత్తిమీర - కొద్దిగా
-నిమ్మరసం - 1 టీస్పూన్

From the Heart of Chettinad The Ultimate Banana Flower Biryani Recipe in Telugu

తయారుచేసే విధానం

-ముందుగా జీలకర్ర సాంబ బియ్యాన్ని శుభ్రంగా కడిగి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అదే సమయంలో శుభ్రం చేసుకున్న అరటి పువ్వు ముక్కలు నల్లబడకుండా కొద్దిగా మజ్జిగ కలిపిన నీటిలో వేసి పక్కన ఉంచండి.

-ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, సోంపు, గసగసాలు, లవంగాలు, యాలకులు, టమోటాను మిక్సీ జార్‌ లో వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-తర్వాత అడుగు మందంగా ఉన్న బిర్యానీ గిన్నెను స్టవ్ మీద పెట్టి నూనె, నెయ్యి వేసి వేడిచేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, రాతిపువ్వు, అనాస పువ్వు వేసి చిటపటలాడించాలి.

-తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి.

-ఆ తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలే వరకు బాగా వేయించాలి.

-ఇప్పుడు మజ్జిగలోంచి తీసిన అరటి పువ్వు ముక్కలను వేసి మసాలాలు పువ్వుకు పట్టేలా కొన్ని నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరో నిమిషం పాటు వేయించండి.

-ఇప్పుడు గట్టి పెరుగును వేసి బాగా కలిపి నూనె వేరయ్యే వరకు ఉడికించాలి.

-తర్వాత అందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

-నీరు బాగా మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసి కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి మెల్లగా కలపాలి. మంటను మీడియంలో ఉంచి, బియ్యం నీటిని పూర్తిగా పీల్చుకునే వరకు ఉడికించాలి.

-ఇప్పుడు మరో స్టవ్‌ పై పాత దోశ పెనాన్ని ఉంచి బాగా వేడి చేయాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నెను ఆ పెనం మీద ఉంచి, మంటను పూర్తిగా తగ్గించాలి. గిన్నెపై మూత పెట్టి, ఆవిరి బయటకు పోకుండా దానిపై బరువైన వస్తువును ఉంచాలి. ఇలా 20 నిమిషాల పాటు దమ్ చేయాలి. అంతే నోరూరించే, ఘుమఘుమలాడే చెట్టినాడు అరటి పువ్వు బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, August 28, 2025, 12:21 [IST]
Desktop Bottom Promotion