దీపావళి స్పెషల్ కుస్ కుస్ అరిసెలు

Kuskus Ariselu
దీపావళి పండుగ రోజున భారతీయులు వివిధ రకాల సంప్రదాయ పిండి వంటలు తయారుచేసుకుంటారు. ఇవి నాటి నుంచి నేటి వరకు స్వీట్స్‌ ప్రియులను పూర్తిగా సంతృప్తి పరుస్తున్నాయి. దీపావళి అనగానే ముఖ్యంగా గుర్తువచ్చేది అత్తిరాసము(అరిసెలు). బియ్యంపిండి, బెల్లంతో తయారు చేస్తారు. అందులో కొంచెం వెరైటీ గసగసాలు కలిపితే ఆ టేస్టే వేరు. దీపావళి పండుగ రోజున వీటిని ప్రత్యేకంగా తయారుచేసుకొని దేవునికి నైవేద్యంగాను సమర్పిస్తారు. అలాగే వచ్చిన అథిధులకు మొదటగా వడ్డించి వారి నోరు తీపి చేసి వారిని మైమరపించి వారి ఆత్మీయతకు ప్రీతి పాత్రులవుతారు.

కావలసినపదార్థాలు:
బియ్యం: 1/2kg
యాలకుల పొడి: 1tsp
తెల్ల నువ్వులు: 2tsp
గసగసాలు: 2tbsp
బెల్లం: 1/2kg
నూనె/నెయ్యి: వేయించడానికి సరిపడా

పిండికోసం:
1. బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. నీళ్లను వంపేసి నీడనే పొడిబట్టమీద బియ్యాన్ని ఆరనివ్వాలి.
2. తడిబియ్యం మూడువంతులు ఆరినాక మిల్లు పట్టించాలి. అంతేతప్ప పొడిబియ్యాన్ని మాత్రం పిండి పట్టడానికి వాడకూడదు.
3. బియ్యం కడిగి ఆరబెట్టే సమయం లేకపోతే బియ్యం ఓసారి కడిగి వెంటనే మిక్సీలో వేసి మెత్తగా పిండిపట్టుకోవచ్చు.

తయారు చేయు విధానము:
1. మందపాటి పాత్రలో తురిమిన బెల్లం, పావుకప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరవాత పలుచటి వస్త్రం లేదా టీ ఫిల్టర్‌తో బెల్లం నీళ్లను వడబోయాలి. ఈ నీళ్లను మళ్లీ పాత్రలో పోసి పాకం పట్టాలి. (సరైన పాకం వచ్చిందో లేదో తెలియాలంటే చిన్నప్లేటులో చల్లటినీళ్లు పోసి అందులో కొద్దిగా పాకాన్ని వేయాలి. దాన్ని వేళ్లతో తీసినప్పుడు ఉండలా అయితే పాకం వచ్చినట్లే)
2. ఇప్పుడు పాత్రను కిందకి దించి యాలకుల పొడి, నువ్వులు, గసగసాలు వేయాలి. వెంటనే బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. పాకం పిండిని పీల్చుకునేవరకూ వేయాలి.
3. చపాతీ పిండిలా అయిపోగానే ఇక పిండి వేయడం ఆపేయాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ వాటిని నెయ్యి రాసిన అరిటాకులమీద మూడు మిల్లీమీటర్ల మందాన వేళ్లతో వత్తి నూనె/నెయ్యిలో వేయించి తీయాలి. తీసిన వెంటనే అరిసెల చెక్కలు లేదా గరిటెలతో వత్తితే వాటిల్లోని నెయ్యి/నూనె అంతా బయటకు వచ్చేస్తుంది. అంతే దీపావళి స్పెషల్ అరిసెలు రెడీ ఇవి దాదాపు పది రోజుల వరకూ నిల్వ ఉంటాయి.!

Desktop Bottom Promotion